గద్వాల కోట

గద్వాల కోట

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రాంతాల్లో గద్వాల కోట ఒకటి. జిల్లాలోని కోటలన్నిటిలోకి ఇది ప్రసిద్ధిచెందినది.ఇది గద్వాల పట్టణం నడి బొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు. ఇతనికే నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నడుస్తున్నాయి. ఇది వలయాకారంలో ఉన్న మట్టికోట. కోట బయటి వైపు ఎత్తైన పెద్ద పెద్ద బురుజులతో మట్టితో నిర్మించారు. లోపలి వైపు కోట మొత్తానికి రాతి గోడ ఒక పొరగా నిర్మితమైంది. బయటి మట్టి గోడలు వర్షాకాలంలో తరుచుగా కూలిపోతున్నప్పటికీ, లోపలి వైపు రాతి గోడ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కోట బయట చుట్టూరా నీటితో నింపడానికి కందకం నిర్మించారు. పశ్చిమాన కోట ప్రవేశద్వారం ఉంది. కోటలోనికి ప్రవేశించగానే, కుడివైపు అధికారుల, భటుల నివాస శిథిలమైన స్థావరాలు కనిపిస్తాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్తే,కుడివైపే ఎత్తైన ఆలయాల ప్రహరీ కనిపిస్తుంది. ప్రహరీ లోపల ఆలయాల సముదాయం కనిపిస్తుంది. వీటిలో మూడు ఆలయాలు చెప్పుకోతగినవి.వాటిలో ప్రధానమైనది. గద్వాల సంస్థాన ప్రభువుల ఇలవేల్పైన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం. ఇది మిగిలిన ఆలయాలకు మధ్యలో ఉండి,ఎత్తైన వేదిక మీద నిర్మించబడి ఉంది. ఆలయం ముందు గాలి గోపురం పట్టణం మొత్తానికి కనిపించేంత ఎత్తుగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.గాలి గోపురం ద్వారా ఆలయంలోని వచ్చే దారిలో మెట్ల దగ్గర గంటా వేదిక ఉంది. రాతి స్తంభాలకు చాలా పెద్దదైన గంట వేలాడి ఉంటుంది. ఈ ఆలయానికి ఇరువైపుల మరో రెండు ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శివాలయం. ఈ ఆలయాలలోని శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ మూడు అలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. ఆలయాల ఆవరణలోకి ప్రవేశించడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న గాలి గోపురం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించవచ్చు. దక్షిణం వైపు కూడా మరో ద్వారం ఉన్నా అది ప్రవేశ ద్వారం కాదు. ఆ ద్వారం గుండా వెళితే కోటలోపలి పురాతన బావి కనిపిస్తుంది. ఆలయాల ప్రహరీకి ఆనుకొని ఆగ్నేయాన రెండు వరుసలలో ఎదురెదురుగా రాజ భవనాలు ఉండేవి. దక్షిణం వైపు భవనానికి అభిముఖంగా మరో రాజభవనం ఉండేది. ఇది రెండంతస్తుల భవనం. ఈ భవనంలోని లోపలి గోడలు అందమైన చిత్రకళతో అలరారేవి. ఉత్తరం వైపు అంతఃపురాన్ని ప్రతిబింబించేలా కలపతో ఏర్పాటుచేసిన అందమైన నిర్మాణాలు కళా నైపుణ్యంతో ఉట్టిపడేవి. ఈ రెండు భవనాల మధ్య అందమైన ఉద్యానం ఉండేది. వనం మధ్యలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న పెద సోమభూపాలుడి (సోమనాద్రి) పెద్ద విగ్రహం ఉండేది. అది కూడా నేడు ధ్వంసమైంది. రాజగోపురానికి తూర్పు వైపు, గోపురానికి అభిముఖంగా రాజా కృష్ణరాంభూపాల్ శిలా విగ్రహం ఉంది.

రాజా పెద సోమభూపాలుడు(సోమనాద్రి) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మతు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు దుర్బేధ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు ఏర్పడటంతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించారని కథ ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. పూడూరును చాళుక్యులు పరిపాలించగా,చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెద సోమభూపాలుడు కూడా పాల్గొని గదను, వాలమును ప్రయోగించడం వలన ఈ ప్రాంతానికి "గదవాల(గద్వాల)" అనే పేరు వచ్చిందని చెబుతారు. ఆవిధంగా ఈ కోట గద్వాల కోటగా చరిత్రలో మిగిలిపోయింది. 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశుల ఆధీనంలో ఉండిన ఈ కోట, సంస్థానాల రద్దు తరువాత ప్రభుత్వ పరమైంది. గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది.

సందర్శన వేళలు: ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకూ

హైదరాబాద్ నుంచి 189 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it