యాదాద్రి

యాదాద్రి

రాయగిరి కొండపై వెలసిన ఈ దేవాలయంలో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో అత్యంత కీలకమైనది. పూర్వం యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేసి ఆ నారసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోర్కె ప్రకారంగా ఈ కొండను యాదగిరి అని పిలుస్తున్నారు.యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి.... యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిగా మారాడు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు.ఆయన కుమారుడు యాద ఋషి. ఆయననే యాదర్షి అని కూడా అంటారు. ఆయన నరసింహస్వామి భక్తుడు. స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోర్కె ఆయనను పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్రనరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించాలని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శన మిచ్చి ‘‘ఏంకావాలో కోరుకో’’ మంటే యాదర్షి స్వామి వారిని ‘‘శాంతమూర్తి’’ రూపంలోను కొలువై కొండపై ఉండాలని కోరాడు. ఆవిధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అయన కోర్కె మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు.ఈ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిద్ధికెక్కింది.

ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, తదితర కోర్కెలతో కొన్నాళ్లపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు.అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్లు ఆ చుట్టుపక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరి గుట్టకు మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనిపిస్తుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు.ఇంకో విశేషం.. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. కొత్త లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం.

సందర్శన వేళలు: ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకూ.

హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాదాద్రి.

Similar Posts

Recent Posts

International

Share it